తెలుగు సాహిత్య ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన కళింగాంధ్ర సాహితీ సాంస్కృతిక ఉద్యమంలో ఆయనిది ఒక చెరగని 'ఛాయ'. అక్షరాలనే సాయుధం చేస్తూ కలం యోధునిగా సామ్రాజ్యవాద సంస్క ృతికి వ్యతిరేకంగా జనచైతన్యం కోసం మహాకవి గురజాడ, శ్రీశ్రీల స్ఫూర్తితో నేను సైతం అంటూ ముందుకు సాగిన ప్రజాకవి ఛాయరాజ్. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తిరీత్యా విప్లవ రచయిత. అన్నింటినీ మేళవించిన సామాజిక దార్శనికుడు కొంక్యాన ఛాయరాజ్. కళింగాంధ్ర సాహితీ వికాసంలోనే కాక తెలుగు సాహిత్య ప్రపంచంలో ఛాయరాజ్ది విభిన్నమైన ముద్ర. ఎవరినీ అనుకరించకుండా, అనుసరించకుండా తనదైన సొంత గొంతుకతో సాహితీలోకంలో బలమైన స్వరాన్ని వినిపించారు. అందుకే ఎంతోమంది అమర వీరుల త్యాగాలతో చైతన్య కేంద్రంగా నిలచిన 'శ్రీకాకుళం' 'ఛాయరాజ్'కు ఇంటిపేరైంది.
'బహుజన హితాయ... బహుజన సుఖాయ' అంటూ సామాజిక మానవతా విలువలను విశ్వమానవాళికి ప్రబోధించిన బౌద్ధక్షేత్రమైన శాలిహుండం పక్కనున్న గార మండలంలోని కొంక్యానపేట ఛాయరాజ్ స్వగ్రామం. 1948 జూలై 6న సూరమ్మ, సత్యనారాయణ దంపతులకు జన్మించారు. బియస్సీ, బిఇడి చదవడమే కాక సామాజిక శాస్త్రంలో ఎంఎ కూడా చేశారు. చిన్నప్పటి నుంచే చుట్టూ ఉన్న సమాజం నుంచి స్ఫూర్తి పొందిన ఛాయరాజ్ ఏనాడూ నేల విడిచి సాము చేయలేదు. సమాజంలో పీడిత ప్రజల పక్షాన రచయితగా, కళాకారునిగా నిలిచారు. ఆ విషయం ఆయన రచనలన్నింటిలోనూ సుస్పష్టం అవుతోంది. ప్రజల భాషలో ప్రజల కోసం, ప్రజలతో మమేకమై వారి ఉద్యమాలకు వెన్నుదన్నుగా, వారి చైతన్యానికి ప్రేరణగా ఎన్నో రచనలను అందించారు. ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఆయన పాఠాలు చెప్పి జీతాలు తీసుకోవడానికే పరిమితం కాలేదు. విద్యారంగ సమస్యలపై, ఉపాధ్యాయరంగ సమస్యలపై శాస్త్రీయ విశ్లేషణలనెన్నింటినో ఆయన చేశారు. 1970 నుంచి 1992 వరకూ ఎపిటిఎఫ్ శ్రీకాకుళం జిల్లా శాఖలో వివిధ బాధ్యతల్లో ఉద్యమ కార్యకర్తగా సేవలందించారు. 1980లో జనసాహితి సంస్ధలో సభ్యునిగా చేరి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, ఆ తరువాత 2007 నుంచి 2013లో తుదిశ్వాస విడిచేవరకూ జనసాహితి రాష్ట్ర అధ్యక్షునిగా తన సాహితీ ప్రస్థానం సాగించారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 1968కి ముందు, ఆ తరువాత సాగిన గిరిజన రైతాంగ ఉద్యమం, సమరశీల పోరాటం, అతివాద చర్యల ఫలితంగా ఏర్పడిన విషాదాన్ని కథా వస్తువుగా తీసుకుని 'శ్రీకాకుళం' పేరుతో ఉద్యమ కథా కావ్యాన్ని 1989లోనే అందించారు. ఇది చాలా చర్చనీయాంశమైంది. అలా ఆయన శ్రీకాకుళం ఛాయరాజ్గా గుర్తింపు పొందారు.
కొండకోనల్లో నివసించే గిరిజనుల హృదయాల్లో ద్రవించే గుండె చెమ్మకు ఇంద్రజాల వాస్తవికతను జోడించి అక్షర చలనచిత్రాన్ని కళింగ వంశధారలో సూర్యబింబంగా ప్రతిబింబించేలా 'గుమ్మ' కావ్యాన్ని 1995లో రాశారు. స్త్రీ, పురుష సంబంధాలను విప్లవీకరించి అందమైన పదచిత్రాలతో 'నిరీక్షణ' కావ్యాన్ని 1996లో అందించారు. స్త్రీ, పురుష రూపాలను, వ్యత్యాసాలను రూపుమాపి నూతన మనిషిని సృజించాలని వసుంధరను వేడుకున్న ఛాయరాజ్ ప్రపంచ జీవశాస్త్రవేత్తల పరిశోధనలను అక్షరాలుగా ఆవిష్కరిస్తూ 'దర్శిని' కావ్యాన్ని 1999లో రాశారు. ఈ కావ్యం ఆంగ్లంలోకి కూడా అనువాదం అయింది. అనాథలంతా, అభాగ్యులంతా, అశాంతులంతా, అనేకులింకా, దీర్ఘశృతిలో, తీవ్రధ్యనితో విప్లవ శంఖం వినిపిస్తారని మహాకవి శ్రీశ్రీ ఆనాడు స్వప్నిస్తే ఆ అనాథ బాలుడిని 'బుధడు'గా స్మ ృతి వాక్యంతో విప్లవ బావుకతతో 2003లో కావ్యంగా మలిచారు. అమ్మతో శిశువుకు గల చైతన్యానుబంధాన్ని 'తొలెరుక'గా కావ్యాన్ని, రైతుల కష్టాలను, కన్నీళ్లను 'దుఖ్కేరు'గా కవితా సంకలనాన్ని, జీవన దృశ్యాల వైవిధ్యాన్ని 'రసస్పర్శ'గా 2005లో కావ్యాన్ని తీసుకొచ్చారు. అంతకుముందే 'మట్టి నన్ను మౌనంగా ఉండనీదు' అనే కవితా సంపుటిని 1999లో రాశారు. 2010లో అమరకోశం కవితలు, అనుపమాన కథారూపకాలు రాశారు. 2012లో 'సాహిత్యోద్యమ పతాక మన గురజాడ' వ్యాసాలు, 'నేను సైతం' పేరుతో శ్రీశ్రీ పై వ్యాసాలను సంకలనంగా తీసుకొచ్చారు. 'జీవరసాగ్ని సొగసు-శ్రీశ్రీ' అనే శీర్షికతో వ్యాస సంకలనాన్ని అందించారు. కవితా కథ, పాట, నృత్యగీతం, సాంఘిక, సైద్ధాంతిక, సాహిత్య వ్యాసాలు, సెల్ఫోన్ కథల పరిచయం, తెలుగు సాహితీ ప్రముఖులపై వ్యాస పరంపరలు ఒక ఎత్తు అయితే- ఆయన రాసిన 'మాతృభాష' కవిత మరొక ఎత్తు. 'పుట్టక దగ్గర, చావు దగ్గర పరభాషలో నవ్వలేను- ఏడ్వలేను' అనే తెలుగుదనపు నినాదం ఛాయరాజ్ కలం నుంచి జనించినదే. ప్రజాకళల్లో నాటకకళ కథానాయకునిగా నిలిచారు ఛాయరాజ్.
అవార్డులకోసం ఎదురుచూసే సాహిత్య వేత్తలకు భిన్నమైన చైతన్యం ఛాయరాజ్ది. అయినా సరే ఆయనను వెతుక్కొంటూ ఎన్నో అవార్డులు వచ్చాయి. వాటిలో ఫ్రీవర్సు ఫ్రంట్, తెలుగు వికాసం అవార్డులు, లాంగుల్య మిత్రుల పురస్కారం, డాక్టర్ ఆవంత్స సోమసుందర్ సత్కారం, సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ కృష్ణశాస్త్రి కావ్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహితీ సాంస్క ృతిక సమాఖ్య సత్కారం, సత్యమూర్తి ట్రస్ట్ శ్రీశ్రీ పురస్కారం, యగళ్ల ఫౌండేషన్ సత్కారం వంటివి ఆయనకు లభించాయి. ఛాయరాజ్ రచనలపై ఎంతోమంది విద్యార్థులు ఎంఫిల్, పిహెచ్డి పరిశోధనలు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. వ్యక్తి చైతన్యాన్ని తన రచనల ద్వారా సామాజిక చైతన్యంగా పదునుపెట్టగల సమర్థుడైన ప్రజాకవి ఛాయరాజ్. ఆయన ఇతిహాసపు చీకటి కోణంలో దాగి వున్న నిజాలను నేటి తరానికి అందించారు. అందులో భాగంగానే కటక్ నుంచి పిఠాపురం వరకూ విస్తరించి ఉన్న కళింగ ప్రజల చారిత్రక విశిష్ఠతను వైవిధ్యభరితమైన కళింగ జీవన సారాన్ని, 2300 సంవత్సరాల క్రితపు కళింగ యుద్ధ నేపధ్యంగా 'కారువాకి' అనే నవలను రాశారు. కళింగ చారిత్రక హృదయ స్పందనని కవితాలయాత్మకంగా ఇందులో చిత్రించారు. అంతవరకూ ఎవరూ స్పృశించని కథా వస్తువును నవలగా తీర్చిదిద్దారు. అనన్యమైన రచనలతో అనంత చైతన్యాన్ని ఆవిష్కరించిన ఛాయరాజ్ మహాకవి గురజాడ జయంతికి ఒక్కరోజు ముందే సెప్టెంబర్ 20న 2013లో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన రచనలు ఎన్నో చైతన్య కిరణాలను తూరుపు తీరం నుంచి మోసుకొస్తూ తెలుగు సాహిత్య లోకంలో వెలుగులను పంచుతున్నాయి.
రచనలు
ముద్రిత రచనలు
లేని నన్ను గురించిన ఆలోచన నీకెందుకు నీ జ్ఞాపకంలో నా ఆశయాన్ని కొనసాగించేటందుకు కానరాని నాకోసం కలగనడం నీకెందుకు నీ రూపంలో నా ఆకాంక్షను నెరవేర్చేటందుకు నేనెందుకు లేనో ఆ ఆవేదన నీకెందుకు నీ కందిన నా హృదయాన్ని పదిమందికీ పంచేందుకు లేని నువ్వు నా కోసం విలపించుట నీకెందుకు మన ఉనికి లేమి సారాంశం అందరికీ తెలిపేందుకు ఇద్దరమూ లేనినాడు మనను వెతికెవారెందుకు మిగిలిన శిల్పాన్ని చెక్కి ముందు తరానికందించేందుకు (ముందూ వెనుకా "పోతున్నప్పు"డల్లా ఒకరు మరొకరితో మాట్లాడుకుంటున్నారు) --ఛాయరాజ్ |
- శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం)(1989): శ్రీకాకుళం ఉద్యమం ప్రభావంతోనే ఛాయరాజ్ ‘శ్రీకాకుళ కావ్యం’ రాసారు.
- గుమ్మ (కొండ కావ్యం) - ఫిబ్రవరి 1995
- దర్శిని (కావ్యం) - ఫిబ్రవరి 1995
- నిరీక్షణ (కావ్యం) - డిసెంబర్ 1996
- బుదడు (స్మృతి కావ్యం) - జూన్ 2003
- తొలెరుక (జన్మకావ్యం) - జనవరి 2005
- దుఖ్కేరు (స్మృతి కావ్యం) - జనవరి 2005
- రస స్పర్శ (కవిత) - జూలై 2005
- ది లాంగింగ్ ఐ ( ఎ లాంగ్ పోయం) ఆగష్టు 1999
(తెలుగు "నిరీక్షణ్"కు ఆర్.ఎస్ & ఎస్.ఎన్.మూర్తి) అనువాదం - మట్టి నన్ను మవునంగా ఉండానీదు (కవితా సంపుటి) ఆగష్టు 1999
- కారువాకి (చారిత్రక కళింగయుద్ధ నవల) సెప్టెంబర్ 2013
- వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డ సుమారు 300 కవితలు.
- సాహిత్య, సామాజిక అంశాలపై వ్రాసిన వ్యాసాలు (ముద్రితమైనవి)
- కథలు: "అనుపమాన" కథారూపకాల పుస్తకం - మార్చి 2010
- సెల్ఫోన్ కథలు : సుమారు 6 కథలు "ప్రజాసాహితి" పత్రికలో 2009-10 సం.లలో ప్రచురితం.
- అనుపమాన కథారూపకాలు
- కుంతి
అముద్రిత రచనలు
- దుగ్గేరు (నృత్య గీతాలు)
- అమరకోశం (కావ్యం)
- చారిత్రక నాటిక
అసంపూర్ణ రచనలు
- గున్నమ్మ (దీర్ఘ కవిత)
- టి.ఎన్.కావ్యం ( దీర్ఘ కవిత)
అవార్డులు
- ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు (2000 సంవత్సరం)
- తెలుగు వికాసం అవార్డు (2006)
- లాంగుల్యా మిత్రుల పురస్కారం (2005) బంగారు పతకం.
- డా. ఆవంత్స సోమసుందర్ సత్కారం, పిఠాపురం, 2004, నవంబర్ 18
- సొ.ను. లిటరరీ ట్రష్టు - కృష్ణశాస్త్రి కావ్య పురస్కారం - నవంబర్ 2010
( జూలై 6 ఛాయరాజ్ జయంతి)
- బెందాళం క్రిష్ణారావు
where can i get these books? specifically i am looking for srikakulam(udyama kadhaa kaavayam). I have searched for this book in all online books websites but havent found it. If anyone can tell me where can i get these books, i will be very thankful to them.
రిప్లయితొలగించండి