9, జులై 2013, మంగళవారం

ద్వారం వెంకటస్వామి నాయుడు

ద్వారం వెంకటస్వామి నాయుడు
ద్వారం వెంకటస్వామి నాయుడు 8 నవంబర్‌ 1893న దీపావళి పర్వదినాన బెంగళూరులో జన్మించారు. భారతదేశం గర్వించదగిన ఒక గొప్ప వయొలిన్‌ విద్వాంసుడు. మద్రాసు సంగీత అకాడమీ 1941లో ఇతనికి సంగీత కళానిధి అవార్డును ప్రదానం చేసింది. భారత ప్రభుత్వం 1957 లో పద్మశ్రీ అవార్డ్‌తో సత్కరించింది. ద్వారం బెంగళూరులో జన్మించినా... పెరిగింది మాత్రం విశాఖపట్నంలోనే. 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం ‘మహారాజా సంగీత కళాశాల’లో వయొలిన్‌ ఆచార్యునిగా నియమితుడయ్యారు.

DWARAM11936లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించడం విశేషం. వయొలిన్‌ వాయిద్యంతో ఒంటరి కచేరీలు ఇవ్వడం ఈయనతోనే ఆరంభం కావడం విశేషం. కాగా మొదటి కచేరి 1938లో వెల్లూరులో జరిగింది. 1952లో అంధుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీలోని జాతీయ భౌతిక శాస్త్ర పరిశోధనాశాల ఆడిటోరియంలో గొప్పగా ‘ద్వారం’ కచేరి జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత వయొలిన్‌ కళాకారుడు యెహుదీ మెనుహిన్‌ ద్వారం వారి వయొలీన్‌ సంగీతాన్ని జస్టిస్‌ పి.వి.రాజమన్నార్‌ ఇంటిలో విని ఎంతగానో ప్రశంసించారు.ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్‌ వాదనలో సున్నితత్వానికి అందె వేసిన చేయి.

కర్ణాటక సంగీతాన్ని సైతం వయొలిన్‌పై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి ద్వారం నాయుడే అంటారు అంతా.... సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు కూడా వ్రాశారు.. ‘తంబూరా విశిష్ట లక్షణాలు’ అలాంటి వ్యాసాలలో ఒకటి. సంగీతం వివిపించే తపస్సు అనీ, ఒక్కరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ ఆయన తన శిష్యులకు చెప్పేవారు. ‘‘ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే మీ సంగీతంలోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి’’ అని ద్వారం చెప్పే సూచనలను ఆయన శిష్యుపరమాణువులు తూ.చ.పాటించేవారు. చెన్నై మహానగరంలో ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టు, విశాఖపట్నంలో ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం స్థాపించబడినాయి. ఈ రెండు నగరాలలోనూ ఈ కళాతపస్వి విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి.

ప్రపంచానికే ముద్దుపేరు
సంగీత కళాజగతికి ముద్దు పేరు ‘ద్వారం’. సంగీత కచేరీ వేదికపైన ప్రక్కనే స్థానం, సహవాద్యకారులుగా చెలామణి అవుతున్న దశనుంచి దిశానిర్దేశం కావించి, పరిపూర్ణ వాయులీన (వైలన్‌ లేక ఫిడేల్‌) సంగీత వాద్య పరికరానికి, మూగవోయిన పనిముట్టుని ‘మెలోడీ ఫీస్ట్‌’ గా మార్చడానికి కంకణం కట్టుకుని, కృషిసల్పిన ఘనత కేవలం ద్వారంనాయుడి గారి కళాజీవన ప్రస్థానంలో మరువలేని, ఎన్నటికీ మార్చలేని మైలురాళ్ళు. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ప్రధమగణంలో వినుతికెక్కిన ద్వారం వెంకటస్వామి నాయుడు 8 నవంబర్‌ 1893న బెంగుళూరులో దీపావళి రోజున జన్మించడంతో సంగీత జగతిలో మరింతగా కాంతి, వెలుగు చోటుచేసుకున్నాయి.

dwaram-uksతండ్రి వెంకటరాయుడు, ఆర్మీలో కమిషన్‌ అధికారిగా ఉద్యోగం చేయడం, ఆయన ఉద్యోగ విరమణ తర్వాత విశాఖపట్నానికి వలసవెళ్ళారు. అనకాపల్లి దగ్గరలోని కాసింకోట వద్ద స్థిరపడ్డారు. అన్న వద్ద వయొలిన్‌ విద్యను అభ్యసించిన ద్వారం తండ్రికి కూడా ఈ వయొలిన్‌ విద్యలో అభినివేశం వుండడం విశేషం. తాత పేరును సార్ధక నామధేయంగా చేసుకున్న వెంకటస్వామినాయుడు తన అన్న వెంకటకృష్ణయ్య, తాత దగ్గర వయొలిన్‌ నేర్చుకుంటున్న సమయంలో, ద్వారం వెంకటస్వామి నాయుడుగారు కూడ అన్నగారి వయొలిన్‌ను కోరిక మేరకు రహస్యంగా కదిలించేవారట. నాయుడుగారికి చిన్నప్పుడు చూపులో కొంచెం సమస్య వున్న కారణంగా చదవడం, వ్రాయడం సమస్యగా మారుతున్న వైనంలో, సంగీతంపై దృష్టి మరల్చవలసి వచ్చింది.

ప్రాధమిక శిక్షణ తర్వాత, ప్రముఖులు పండిత సంగమేశ్వరశాస్ర్తి
గారి వద్ద నాయుడుగారు వయొలిన్‌ వాదనలో నిష్ణాతులు అవ్వడం జరిగింది. అందుకే నాయుడుగారు తరచుగా నల్లరంగు కళ్ళజోడు ధరించేవారు. నాయుడుగారు 14వ ఏటనుంచే వయొలిన్‌తో తదాత్మ్యం పొందడం, ప్రముఖ సంగీత విశ్లేషకుడు మారేపల్లి రామచందర్రావు ద్వారం వయొలిన్‌ ప్రతిభను గమనించి, డైమండ్‌ ఉంగరాన్ని కానుకగా యివ్వడమే కాక, ద్వారం వారికి ‘ఫిడేల్‌ నాయుడు’ అని బిరుదుని యిచ్చారట. వయొలిన్‌నే ఫిడేల్‌ అని పిలుస్తారని చాలా మందికి తెలియని విషయం. ఫిడేల్‌ అంటే ‘ఫిడులా’ అని జర్మనీ దేశపు పదంనుంచి ఫిడేల్‌ అని రూపాంతరం చెంది నాయుడుగారి దగ్గరకు చేరుకుంది. అప్పటినుంచి, ఫిడేల్‌, ఆంధ్రదేశపు సంగీత జగతితో మమేకమయింది.

వయొలిన్‌ పుట్టు పూర్వోత్తరాలు
Dwaram_Venkataswaసంగీత వాద్య పరికరమేఅయినా కొత్తగా అనిపించే వయొలిన్‌ 17వ శతాబ్దం మధ్యకాలంలో వాయులీన పరికరాలకు ప్రాణంపోసే పాశ్చాత్యుల పుణ్యమా అని, కర్నాటక సంగీత సంప్రదాయంలో అన్యాపదేశంగా ప్రవేశించి, తిష్ఠ వేసుకుంది. మొదటిసారిగా, ‘వడివేలు అన్న విద్వాంసుడు, ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలని వయొలిన్‌పై అందించగా, దీక్షితులవారి సోదరుడు బాలు(1786-1859) దక్షిణభారత సంగీత వినువీధుల్లోకి వయొలిన్‌ని తీసుకొచ్చిన ఘనత మనకు అలవడిన సంప్రదాయం.

తర్వాత, 19వ శతాబ్దం ఆఖరి పాదంలో, కర్నాటక సంగీతధోరణుల్లో వయొలిన్‌తో సంపూర్ణంగా ఏకైక వ్యక్తితో కచేరీ చేయడం ప్రారంభం అవడం, దీనికి తిరుకొడికవల్‌ కృష్ణ అయ్యర్‌, గోవిందస్వామి పిళ్ళైలు రంగప్రవ్రేశం చేశారని సంగీత చరిత్ర చెబుతున్న కథనాలు. వీణ, వేణువు, నాదస్వరంతో వయొలిన్‌ను చేర్చిన ఘనత మాత్రం ద్వారం వెంకటస్వామినాయుడికే దక్కుతుంది. వాద్యసంగీతజగతిలో అంతవరకూ నిత్యనూతనంగా అలరించిన, వీణ, వేణువు, నాదస్వరాల ఘనమైన వరసలో వయొలిన్‌ను నిలబెట్టిన ఘనత మాత్రం మన ‘ఫిడేల్‌ ద్వారం నాయుడే’ అన్నది మాత్రం సత్యం. వీటికి వయొలిన్‌ లేక వాయులీన ప్రక్రియ ఏమాత్రం తీసిపోదని కూడా నిరూపించిన నిష్ణాత విద్వాంసుడు ద్వారం నాయుడు.

ప్రముఖుల ప్రశంసలు
పాశ్చాత్య, భారతీయ సంగీత మెలకువలను ఆకళింపుచేసుకున్న నాయుడుగారి వయొలిన్‌ పరికరాన్ని కచేరీలో నియంత్రించే విధివిధానాలు, నాయుడుగారి భంగిమ, చేతివేళ్ళతో తంత్రిణ స్వరలక్షణాలన్నింటినీ, ప్రముఖ చిత్రకారుడు రవివర్మ తనదైన ప్రత్యేకమైన శైలిలో నాయుడుగారి కచేరీ చేస్తున్నట్లుగా చిత్రీకరించిన చిత్రం విశ్వవ్యాప్తంగా ఆయన అభిమానులను ఆశ్చర్యానందభరితుల్ని చేసింది. రవివర్మ చిత్రంలో నాయుడుగారి మనోధర్మ సంగీత లక్ష్యలక్షణాల్ని ప్రతిభావంతంగా ప్రదర్శించారు అన్నది మహామహుల అభిప్రాయంగా నేటికీ వినవస్తుంది. అలాగే ద్వారం నాయుడుగారి కళాప్రతిభను కొనియాడుతూ, వివిధరంగాల్లోని ప్రముఖులు ప్రశంసలు గుప్పించడం కూడా జరిగింది.
ద్వారం నాయుడుగారి వయొలిన్‌ వాద్య కచేరీని కొద్ది నిముషాలే చూడగలగను అన్న గురుదేవులు రవీందన్రాధ్‌ ఠాగూర్‌, అన్ని ముఖ్య కార్యక్రమాలను అనుకున్నవి మరచి పోరుు పూర్తి కచేరి వినడమే కాక, నాయుడు గారి కీర్తనలకు రవీంద్రుడు స్వరం, గళం కలిపి గానం చేయడం సంగీతచరిత్రలో ప్రముఖ సంఘటనగా నిలచిపోరుుంది. ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్‌కు సంబంధించిన గ్రామఫోన్‌ రికార్డ్‌, పక్కనే ఆయనపేరిట విడుదల చేసిన పోస్టల్‌ స్టాంప్‌.

మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ - సంగీత కళానిధి అవార్డు - 1941, సంగీత నాటక అకాడమీ - 1953, పద్మశ్రీ అవార్డు - 1957, భారతీయ తపాలా శాఖవారు 1993 లో ఆతని శతజయంతి సందర్భంగా తపాలా బిళ్ళ విడుదల చేశారు. రాజా లక్ష్మీ అవార్డు - 1992లో - శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్‌ వారిచే, శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టుకు బహూకరింపబడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి